ఉండవల్లి సెంటర్లో వరుస దొంగతనాలు.. వ్యాపారుల్లో ఆందోళన
ఉండవల్లి సెంటర్లో వరుస దొంగతనాలు.. వ్యాపారుల్లో ఆందోళన
తాడేపల్లి పరిధిలో చెలరేగుతున్న దొంగలు.. నిఘా పెంచాలని స్థానికుల డిమాండ్
తాడేపల్లి, ఆగస్టు 28:
తాడేపల్లి పరిధిలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘా లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఉండవల్లి సెంటర్లో తాజాగా దొంగలు తమ చేతివాటం చూపించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో కూడా కొంత రద్దీ ఉండే ఈ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎదురుగా ఉన్న స్టీల్ షాప్తో పాటు సమీపంలోని బేకరీలో దొంగతనం జరిగినట్లు తెలిసింది.
ఈ ఘటనలో సుమారు రూ.80 వేల విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు పర్యాయాలు దొంగతనాలు జరిగినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
గత ఘటనలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పాటు, తాజాగా జరిగిన దొంగతనాలపై కూడా ఎలాంటి పరిష్కారం లభిస్తుందోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయామని కొందరు వ్యాపారులు వాపోతున్నారు.
ఇకనైనా పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, వ్యాపారులు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.