జరిమానా కాదు… ప్రాణ రక్షణే ముఖ్యం
హెల్మెట్ కొనిపించి అవగాహన కల్పించిన చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో పోలీసులు రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి, జరిమానా విధించకుండా వారికి హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించారు.
నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ పర్యవేక్షణలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం వారిచేత హెల్మెట్లు కొనుగోలు చేయించి వెంటనే ధరించేలా చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారంగా భావించకూడదని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు. ప్రమాదం సంభవించినప్పుడు తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని వివరించారు.
వాహనదారులు తమ కుటుంబ బాధ్యతను గుర్తుంచుకొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రస్తుతం ప్రమాదాలకు గురవుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నారని, వేగాన్ని నియంత్రిస్తూ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.