ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మే డే ఉత్సవాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సివిల్ సప్లై గోడౌన్ వద్ద యూనియన్ అధ్యక్షుడు దంతాల వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన కార్మిక ర్యాలీ బస్టాండ్ సెంటర్, సత్తుపల్లి రూట్, లక్ష్మీ టాకీస్ సెంటర్, శ్రీశ్రీ కాలేజీ మీదుగా తిరిగి బస్టాండ్ వైపు సాగి ఏఐటీయూసీ ఆఫీస్ వద్ద ముగిసింది.
ర్యాలీ మార్గమధ్యంలో బస్టాండ్ సెంటర్, ఎరువులు షాపు వద్ద ముఠా వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు పసుమర్తి శ్రీనివాసరావు, గోపాలం సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆఫీస్ వద్ద సీనియర్ నాయకుడు గుంజాల న్యాయచార్య కార్మికులకు అభినందనలు తెలిపారు.
బస్టాండ్ సెంటర్లో సిపిఐ పార్టీ జెండాను మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం పోరాట చరిత్రను గుర్తు చేశారు. ఒకప్పుడు 18 గంటల పని దినాల నుంచి కార్మిక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం సాధించుకున్న చరిత్ర ఉందని తెలిపారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలను 12 గంటలకు పెంచే ప్రయత్నాలు, మహిళా కార్మికులకు నైట్ షిఫ్ట్ నిబంధనలు వంటి అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్యంగా నిలవాలని, సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు, సివిల్ సప్లై, ఎరువులు, ముఠా, పార్సిల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.