ఆరుగొలనుపేట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి విశేష స్పందన
ఆరుగొలనుపేట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి విశేష స్పందన
- కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడు పానుగళ్ళ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పానుగళ్ళ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద కుటుంబాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రహదారులు, తాగునీటి సౌకర్యాలు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతుండగా, మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.