రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించాలి: ఏపూరి గోపాలరావు
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
పల్నాడు | Ntoday News
పల్నాడు జిల్లాలో తక్కువ వర్షపాతం, తగ్గిన సాగు విస్తీర్ణం కారణంగా రొంపిచర్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు.
మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రొంపిచర్ల చెరువుకట్ట సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందించాలని కోరారు. రీ సర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు పశువులకు ఉచితంగా పశుగ్రాసం అందించాలని కోరారు. రానున్న రబీ సీజన్కు సబ్సిడీపై విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేసి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.