ట్రామడాల్ ఇంజెక్షన్ల అక్రమ కొనుగోలు, నిల్వ, విక్రయాలు.. ఆర్ఎంపీ వైద్యుడు అరెస్ట్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం: ట్రామడాల్తో కూడిన మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, ఎలాంటి బిల్లులు లేకుండా, వైద్యుల సూచన పత్రాలు లేకుండానే విక్రయిస్తున్న వ్యవహారంలో కుక్కునూరు మండలానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 73 ట్రామడెక్స్ ఇంజెక్షన్ అంప్యూల్స్తో పాటు అక్రమ కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ సూచనల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీఐ ఎం.వి. సుభాష్, ఎస్ఐ ఎన్. వీర ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి ఈ చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైన నేర సంఖ్య 275/2026లో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కుక్కునూరు మండలం కివ్వక గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పగిల్ల నాగేంద్రకుమార్ (31) ట్రామడాల్ కలిగిన ట్రామడెక్స్, ట్రామెక్ వంటి ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలాంటి కొనుగోలు బిల్లులు లేకుండా, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 61(2)తో పాటు 3(5), మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8(సి) రెడ్ విత్ 22(సి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో గతంలో శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ యజమాని కాండ్రేగుల లక్ష్మణ సాయి కిషోర్, జ్యోతిక పెద్దింటి మెడికల్ హాల్ యజమాని ఏలూరి సతీష్, రూపా పెద్దింటి మెడికల్ ఏజెన్సీ యజమాని ఏలూరి దుర్గా ప్రసాద్, దేవ రాజశేఖర్, చిరు మెడికల్ అండ్ జనరల్స్ షాప్ యజమాని తమ్మిశెట్టి చిరంజీవి, శ్రీ భవాని మెడికల్ ఏజెన్సీస్ యజమాని మాధవరపు శివకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించినట్లు తెలిపారు.
వారిని విచారించడంతో పాటు కొనసాగించిన దర్యాప్తులో లభించిన సమాచారాన్ని విశ్లేషించగా నాగేంద్రకుమార్ కూడా ట్రామడాల్ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో మంగళవారం నాగేంద్రకుమార్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
73 ఇంజెక్షన్లు స్వాధీనం
అరెస్ట్ చేసిన నిందితుడి వద్ద నుంచి హైదరాబాద్కు చెందిన ఓ ఔషధ సంస్థకు సంబంధించిన 73 ట్రామడెక్స్ ఇంజెక్షన్ అంప్యూల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కొనుగోలు, విక్రయాలకు సంబంధించి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ దర్యాప్తులో సీఐ ఎం.వి. సుభాష్, ఎస్ఐ ఎన్. వీర ప్రసాద్, నేర విభాగం ఏఎస్ఐ ప్రత్యా సంపత్, కానిస్టేబుళ్లు ఎన్. రమేష్, ఎస్కే. షన్బాబు, మణికంఠ, సీహెచ్. సత్యనారాయణ, యు. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.