నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక
మేస్రం ఆనందరావుతో పాటు పలువురు సర్పంచులు, నాయకుల చేరిక.. అక్టోబర్లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు కవిత వ్యూహం
ఆదిలాబాద్ | Ntoday News
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని ప్రముఖ నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మేస్రం ఆనందరావుతో పాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణ తదితరులు తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అక్టోబర్లో ఇంద్రవెల్లిలో భారీ సభ
తెలంగాణ రక్షణ సేన కార్యకలాపాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరింత విస్తరించేందుకు అక్టోబర్లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు, బంజారా వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ అనంతరం ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మరో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఇంద్రవెల్లి సభ తేదీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.