సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన
నంద్యాల జిల్లా
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులకు కీలక సూచనలు – బీసీ వెల్ఫేర్ హాస్టల్, పాఠశాల, కళాశాలల సందర్శన
నంద్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్, IPS శుక్రవారం సుండిపెంటలోని వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సచివాలయం 2 బిల్డింగ్ కు మారుతున్న సందర్భంగా అక్కడి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై పోలీసుల స్పందన తదితర అంశాలపై ఆరా తీశారు.
అనంతరం, వారాంతపు దినాలలో సుండిపెంటలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సుండిపెంటలోని ప్రధాన కూడళ్లు, RTC బస్టాండ్, అక్కమ్మ సెంటర్, పూర్ణానంద స్వామి ఆశ్రమం, పండ్ల బజార్, స్టోర్ శంకర్ మరియు ఎన్టీఆర్ సర్కిల్, లింగాల ఘాట్ రోడ్, డ్యాం పాయింట్ తదితర ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం స్థానిక ప్రజలతో ఎస్పీ మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సేవలను మరింత ప్రజలకు చేరువ చేయడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తదుపరి సుండిపెంటలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం స్థానిక పాఠశాల మరియు కళాశాలను సందర్శించి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం, మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.