తెలంగాణాలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు.. బస్సు–ఆటో ప్రయాణానికి ఒకే టికెట్..!
తెలంగాణాలో త్వరలో రోడ్డుపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు.. బస్సు–ఆటో ప్రయాణానికి ఒకే టికెట్..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. "ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ" పేరుతో త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రారంభించనుంది. ఈ కొత్త విధానంతో బస్సు ప్రయాణానికి అనుసంధానంగా ఆటో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ విధానంలో ప్రయాణికులు బస్సు, ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇంటి నుంచి సమీప బస్ స్టాప్ వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలో చేరుకుని, అక్కడి నుంచి బస్సులో ప్రయాణించవచ్చు. అలాగే గమ్యస్థానంలోని బస్ స్టాప్ వద్ద దిగిన తర్వాత అక్కడి నుంచి తుది గమ్యానికి కూడా అదే విధంగా ఆర్టీసీ ఆటో సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఈ ప్రాజెక్టును తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనుండగా, అనంతరం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన, పర్యావరణహిత రవాణా సేవలు అందించడంతో పాటు, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఆర్టీసీ లక్ష్యంగా భావిస్తోంది.