www.ntodaynews.com
మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. 01-01-2026ను అర్హత తేదీగా తీసుకుని శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్ ఓటర్ల జాబితాలను రూపొందించనున్నారు. సెప్టెంబర్ 3న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు ఓటర్ల జాబితా తయారీ బాధ్యతలను అప్పగించారు. జీవీఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్లకు బాధ్యతలు కేటాయించారు. మేయర్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి సమగ్ర మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.