పెనుగొలను గ్రంథాలయంలో ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో శనివారం మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అడవి బిడ్డల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గెరిల్లా పోరాటం సాగించి స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. కేవలం 27 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా అల్లూరి పేరు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అలుగుల వెంకట రామణ, దేవర సత్యం బాబు, దేవర శీను, గుమ్మడి వెంకటయ్య, సాయిబాబా కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొని అల్లూరి సేవలను స్మరించుకున్నారు.