పెనుగోలను గ్రంథాలయంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శాఖా గ్రంథాలయంలో బుధవారం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమ అభివృద్ధిలో రంగనాథన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. గ్రంథాలయ శాస్త్రంపై అనేక విలువైన గ్రంథాలను రచించి, దేశంలో గ్రంథాలయ వ్యవస్థకు పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
రంగనాథన్ 1945–47 మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడిగా, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా సేవలందించారని తెలిపారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారని చెప్పారు. భారతీయ గ్రంథాలయ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారని వివరించారు. 1957లో అంతర్జాతీయ సమాచార, పత్రాల సమాఖ్య గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు.
గ్రంథాలయ రంగానికి రంగనాథన్ చేసిన విశేష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని కొనియాడారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవర నరసింహారావు, అలుగుల వెంకటరమణ, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.