సన్నాల డిమాండ్తో సీడ్ కంపెనీల దందా.. ఒక్కో బ్యాగుపై రూ.200 వరకు భారం
రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్న ధాన్యాలకు బోనస్ ప్రకటించడంతో ఆయా విత్తనాలకు మార్కెట్లో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీడ్ కంపెనీలు వరి విత్తనాల ధరలను అమాంతం పెంచి రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని సాకుగా చూపుతూ 10 కిలోల విత్తనాల బ్యాగుపై రూ.150 నుంచి రూ.200 వరకు ధరలను పెంచాయి.
గత ఏడాది రూ.900కు లభించిన సన్న ధాన్యం సీడ్ బ్యాగు ప్రస్తుతం రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రముఖ కంపెనీల వెరైటీలకు మరింత డిమాండ్ ఉండటంతో ఎమ్మార్పీ రూ.1,510గా ఉండగా, రైతులకు రూ.1,200 నుంచి రూ.1,250 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్ పోటీ కారణంగా కొందరు డీలర్లు ధరలు తగ్గించి అమ్మేందుకు ప్రయత్నించినా, కంపెనీలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048, హెచ్ఎంటీ సోన, జైశ్రీరామ్, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించింది. అయితే రైతులు ఎక్కువగా జైశ్రీరామ్, తెలంగాణ సోన రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రకాల పంట కాలం తక్కువగా ఉండటం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని హెచ్చరించడంతో రైతులు స్వల్పకాలిక రకాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏడాది జైశ్రీరామ్, తెలంగాణ సోన రకాలకు క్వింటాల్కు రూ.3 వేల నుంచి రూ.3,200 వరకు ధర లభించడంతో ఈసారి కూడా మంచి గిట్టుబాటు వస్తుందనే ఆశతో రైతులు ఈ రకాల సాగుకు సిద్ధమవుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఈ వానాకాలంలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కారణంగా దాదాపు 90 శాతం విస్తీర్ణంలో సన్నాల సాగు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, సీడ్ కంపెనీల ధరల పెంపుతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి విత్తనాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల సీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు.