ఉద్యోగులకు కీలక నిర్ణయం.. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ గడువు జూలై 5 వరకు పొడిగింపు
అమరావతి | N Today News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల ఫ్రీజింగ్కు సంబంధించిన పరిమితుల గడువును జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ గడువులోగా అన్ని శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టుల సృష్టి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
అదేవిధంగా, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) సమావేశాలను నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నిర్ణయంతో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సమయానికి పూర్తి చేసి, ఉద్యోగుల పదోన్నతులు మరియు పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.