విస్సన్నపేటలో సిపిఐ పాదయాత్ర.. ప్రజా సమస్యలపై వినతులు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యలపై మార్పు కోసం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు నాయకత్వం వహించారు.
పాదయాత్ర ఎన్టీఆర్ కాలనీ, బీసీ కాలనీ, ఇందిరా కాలనీ, రాజీవ్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కాలనీ, బీసీ కాలనీలలో ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని, ఇందిరా నగర్లో డ్రైనేజీ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విన్నవించారు. ఈ సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ కృషి చేయాలని కోరారు.
సిపిఐ జిల్లా నాయకుడు తూము కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, రైతులు, చేతివృత్తిదారుల సంక్షేమానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే పాదయాత్రల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిలుకూరు వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి మర్సకట్ల త్యాగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నందికొల్ల రాజేష్, పితాని నాగేశ్వరరావు, ఓడిత్య కేశవ, దుర్గ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.