వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో జాగ్రత్తలు
తిరువూరు: ఎల్నినో ప్రభావంతో వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ సూచించారు. బోరు నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేపట్టాలని, ఇతర రైతులు తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, జొన్నలు, రాగులు సాగు చేయాలని కోరారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగులో నష్టాలను నివారించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం సంభవించినప్పుడు ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. పంటల బీమా నమోదుకు ఆగస్టు 15, 2026 వరకు గడువు ఉన్నందున తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యూరియా కొనుగోలు సమయంలో సాంకేతికంగా లేదా ఇతరత్రా సమస్యలు ఎదురైతే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను ప్రోత్సహించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రైతులకు విజ్ఞప్తి చేశారు.