ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు
ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు
సెప్టెంబర్ 28లోగా వివరాలు సరిచేసుకోవాలి.. లేదంటే ఓటు తొలగింపు
అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 44.89 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత, మరో 44.21 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తోంది.
ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న కొందరు ఓటర్ల వివరాలు 2002 నాటి ఓటరు జాబితాలోని వారి పేరు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల వివరాలతో సరిపోలలేదు. మరికొందరి వివరాల్లో తప్పులు గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఓటర్లు సెప్టెంబర్ 28వ తేదీలోగా తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)ను సంప్రదించి అవసరమైన ఆధారాలు సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.
సరైన వివరాలు అందించి ధ్రువీకరణ పూర్తి చేసుకున్న వారి పేర్లు తుది ఓటరు జాబితాలో కొనసాగుతాయి. గడువులోగా స్పందించని వారి పేర్లు తుది జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటు హక్కు కొనసాగించుకోవాలంటే ప్రతి ఓటరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.