పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి
పీలేరు | అన్నమయ్య జిల్లా | N Today News
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం టానా వడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పీర్ల పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బీ, ఆమె మనవడు వాహిద్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగురిని అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విషాద ఘటనతో మృతుల స్వగ్రామమైన రేగళ్లలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.