చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత
చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత
చింతలపూడి పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో, అందుబాటులో ఉన్న కొద్దిమంది బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఉదయం నుంచే కిలోమీటర్ల మేర క్యూలలో నిల్చున్న వాహనాలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తున్నాయి.
ఇప్పటికే ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇశ్రాయేల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రస్తావించిన నేపథ్యంలో, చింతలపూడిలో కనిపిస్తున్న పరిస్థితులు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి.
ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అవసరమైన మేరకు ఇంధనం నింపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి సరఫరా వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.