బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి
బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి: తిరువూరు ఆర్డీవోకు వినతి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో బేడా బుడగ జంగాల సమస్యలపై బేడా బుడగ జంగాల సంఘం కార్యదర్శి భూతం మారయ్య, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య ఆధ్వర్యంలో తిరువూరు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చుతామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వల్ల ఆ వర్గానికి చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ వర్గానికి కనీసం నివేశ స్థలాలు కూడా లేక అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఆర్థిక స్థోమత లేకపోవడంతో వారి పిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, బేడా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రయోజనం పొందగలరని పేర్కొన్నారు. గతంలో ఎస్సీల వర్గీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసిన తరహాలోనే బుడగ జంగాల సమస్యపై కూడా ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బేడా బుడగ జంగాల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవాని పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.