ఏపీలో మళ్లీ కరోనా కలకలం
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన
ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో జూన్ 26 నుంచి ఇప్పటివరకు 12 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు వెలుగుచూస్తుండగా, కోవిడ్ కారణంగా నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు బాధితులు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది. 2020లో ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ వస్తాయేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచించింది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.