ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు
ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం ఎలక్ట్రిక్ బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణం ముందు నిలిపిన ఎలక్ట్రిక్ బైక్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోగా, పక్కనే పార్క్ చేసిన మరో ద్విచక్ర వాహనానికి కూడా మంటలు అంటుకున్నాయి.
హఠాత్తుగా మంటలు ఎగసిపడటంతో అక్కడ ఉన్న వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీరు, ఇసుకతో మంటలను అదుపులోకి తీసుకువచ్చి మరింత ప్రమాదం జరగకుండా నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి కావడంతో యజమానులకు నష్టం వాటిల్లింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.