పెనుగొలనులో పద్మశ్రీ గ్రహీత జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలు ఘనంగా
పెనుగొలనులో పద్మశ్రీ గ్రహీత జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలు ఘనంగా
జూలై 16: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత ఎస్.టి. జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా సేవా కమిటీ కన్వీనర్ రంగు సత్యనారాయణ మాట్లాడుతూ జ్ఞానానందకవి 1922 జూలై 22న విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆయన రచించిన 'హరిజనులు అంటరానివారా', 'అక్షర రాక్షసులు', 'వెలుగు బాట' వంటి రచనలు సమాజంలోని అసమానతలపై పోరాటానికి స్ఫూర్తినిచ్చే సాహిత్యంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి జ్ఞానానందకవి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కవితా విశారద, కవి కోకిల, సాహితీ వల్లభ, మహాకవి, కళా ప్రపూర్ణ, కవితా శ్రీనాథ, కవి సార్వభౌమ వంటి బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని వివరించారు. నేటి యువత ఆయన రచనలను చదివి సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ, మహిళా సభ్యురాలు దేవర అంజలి, విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.