నూజివీడులో బీజేపీలోకి భారీ చేరికలు.. డాక్టర్ చిన్నం రామకోటయ్యకు ఘన స్వాగతం
నూజివీడు: నూజివీడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామకోటయ్య తిరిగి బీజేపీలో చేరడం నూజివీడు నియోజకవర్గానికి, ముఖ్యంగా చాట్రాయి మండల పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.
రామకోటయ్య నాయకత్వంలో నూజివీడు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీని ప్రజల్లో మరింత బలంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
త్వరలోనే చాట్రాయి మండల కేంద్రంలో డాక్టర్ చిన్నం రామకోటయ్య సమక్షంలో భారీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని, నూజివీడు నియోజకవర్గంలో పార్టీ విస్తరణకు ఇది కీలక వేదిక కానుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.