చనుబండ భక్తుల పాండవుల గట్టు యాత్ర
చనుబండ భక్తుల పాండవుల గట్టు యాత్ర
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ నుంచి భక్తులు పాండవుల గట్టుకు బయలుదేరారు. గత 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యాత్ర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోతామనే ఆందోళనలో ఉన్న చనుబండ బీసీ కాలనీ రైతులు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొండపర్వ గ్రామంలోని పాండవుల గట్టుకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఇంటి వద్దకు భక్తులు చేరుకోగా, వారితో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి తప్పకుండా వర్షాలు కురుస్తాయని, రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
తీవ్ర ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రైతులందరూ పంటల బీమా చేయించుకుని నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.