జేజేఎం పనుల పేరుతో సీసీ రోడ్ల ధ్వంసం – మరమ్మతులు చేయక ప్రజలకు అవస్థలు
జేజేఎం పనుల పేరుతో సీసీ రోడ్ల ధ్వంసం – మరమ్మతులు చేయక ప్రజలకు అవస్థలు
సారిపల్లిలో జేజేఎం పనులపై ప్రజల ఆగ్రహం – రోడ్లు బాగు చేసేదెప్పుడు?
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ (JJM) పనుల పేరుతో సీసీ రోడ్లను తవ్వి పైప్లైన్లు ఏర్పాటు చేసిన అనంతరం రోడ్లను సక్రమంగా పునరుద్ధరించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైప్లైన్ పనుల కోసం ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్లను పలుచోట్ల బ్రేక్ చేసి పనులు చేపట్టారు. అయితే పనులు పూర్తయిన తర్వాత తవ్విన ప్రాంతాల్లో తిరిగి నాణ్యమైన సీసీ రోడ్డు వేయకుండా వదిలేయడంతో రోడ్లు గుంతలమయంగా, అధ్వానంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, వృద్ధులు, చిన్నారులు రాకపోకలు సాగించేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి తవ్విన ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కోసం నిర్మించిన సీసీ రోడ్లను అభివృద్ధి పనుల పేరుతో ధ్వంసం చేసి, తిరిగి పునరుద్ధరించకుండా వదిలేయడం ఏ రకమైన అభివృద్ధి? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
JJM పనులు చేపట్టిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్, గ్రామ పంచాయతీ అధికారులు పనులు పూర్తయిన తర్వాత రోడ్లను యథావిధిగా పునరుద్ధరించే బాధ్యత ఎవరిది? అని ప్రజలు నిలదీస్తున్నారు.
రోడ్లు తవ్వడానికి అనుమతులు ఉంటే.. తిరిగి రోడ్లు బాగు చేయడానికి బాధ్యత లేదా? అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు సారిపల్లి గ్రామంలో JJM పైప్లైన్ పనుల కారణంగా దెబ్బతిన్న అన్ని సీసీ రోడ్లను పరిశీలించి, నాణ్యమైన మెటీరియల్తో వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
లేనిపక్షంలో రోడ్ల దుస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజల సమస్యను అధికారుల దృష్టికి మరింత బలంగా తీసుకెళ్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.