మంగపేటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలతోనే శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం అంగన్వాడీ కార్యకర్త అనిత
నూజివీడు: ఐసిడిఎస్ నూజివీడు ప్రాజెక్టు పరిధిలోని చీపురుగూడెం పంచాయతీ మంగపేట గ్రామంలోని కోడ్–171 అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్ర పర్యవేక్షకురాలు గాయత్రీ దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త అనిత మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలను అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. తల్లి మొదటి పాలలో శిశువుకు అవసరమైన పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు అధికంగా ఉంటాయని వివరించారు. శిశువు పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే ఇవ్వాలని, నీరు, తేనె, ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు.
తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. తల్లిపాలు అందించడం వల్ల శిశువుల్లో అంటువ్యాధులు, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయని, భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన జీవనానికి పునాది పడుతుందని పేర్కొన్నారు. బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిపాల ప్రాముఖ్యతపై కుటుంబ సభ్యులు కూడా అవగాహన పెంచుకుని బాలింతలకు సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు బేబీ సులేఖిని, నాగేశ్వరి, మౌనిక, వరలక్ష్మి, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.