ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ
కలిదిండి: ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి మండలం, కలిదిండి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి కె. ఐఏఎస్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన మార్గాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.
పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.