నేహా బోరాపై దాడి హేయమైన చర్య డి.హరినాధ్
నేహా బోరాపై దాడి హేయమైన చర్య డి.హరినాధ్
విస్సన్నపేట: రాంచీలో ఏఐఎస్ఏ–ఆర్వైఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీలో ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై దాడి చేయడం హేయమైన చర్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం పిరికితనానికి నిదర్శనమని, ఇలాంటి చర్యలు దాడులకు పాల్పడుతున్న వారి రాజకీయ దివాళాకోరుతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయని హరినాథ్ విమర్శించారు. నేహా బోరాతో పాటు మహిళా ఉద్యమకారులపై దాడి చేసి సిరా చల్లడం ద్వారా ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించడం మతోన్మాద, ఫాసిస్ట్ శక్తుల దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.
పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటున్నప్పటికీ, వాటిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న విద్యార్థులు, ఉద్యమకారులపై గూండాలను ఉసిగొల్పడం సిగ్గుచేటని హరినాథ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని, విద్యార్థి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నేహా బోరాపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, దాడి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులెవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలకు స్వస్తి పలికి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచాలని ఆయన అన్నారు.