పేదల సంక్షేమానికి పునాదులు వేసిన టీడీపీ
పేదల సంక్షేమానికి పునాదులు వేసిన టీడీపీ: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, మార్చి 29 (ప్రతినిధి):
పేదల సంక్షేమానికి బలమైన పునాదులు వేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం పశ్చిమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో పంచుకున్నారు. “జోహార్ ఎన్టీఆర్”, “జై తెలుగుదేశం” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.
పార్టీ స్థాపన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానేత ఎన్టీఆర్ నాయకత్వం గొప్పదనాన్ని చాటిందన్నారు. కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం, పేదలకు పక్కా గృహాల నిర్మాణం వంటి పథకాల ద్వారా ఎన్టీఆర్ పేదల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు.
అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తితో, విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ ప్రణాళికలు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంతో టీడీపీ మరింత బలపడిందన్నారు. కోటికి పైగా సభ్యత్వాలు నమోదు కావడం ఇందుకు నిదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.