ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం ఆత్కూరులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.
మైలవరం నియోజకవర్గంలో గత 23 నెలల కాలంలో రూ.417.36 కోట్ల పింఛన్ల సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. జూన్ నెలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా 42,979 మంది లబ్ధిదారులకు రూ.18.85 కోట్ల పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు.
మైలవరం మండలంలో 9,370 మందికి రూ.4.06 కోట్లు, జి.కొండూరులో 8,382 మందికి రూ.3.61 కోట్లు, ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి రూ.2.01 కోట్లు, రెడ్డిగూడెంలో 7,045 మందికి రూ.3.04 కోట్లు, విజయవాడ రూరల్లో 8,351 మందికి రూ.3.60 కోట్లు, కొండపల్లిలో 5,168 మందికి రూ.2.29 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ప్రతి నెలా నియోజకవర్గంలో 42 వేల మందికి పైగా లబ్ధిదారులకు రూ.18 కోట్లకుపైగా పింఛన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచి సామాజిక భద్రతను బలోపేతం చేసిందన్నారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నామని తెలిపారు.
అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రభుత్వం రాజీ పడదని, అభివృద్ధి–సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.