విద్యార్థులకు తెలుగు భాషను సంస్కృతిగా బోధించాలి
విద్యార్థులకు తెలుగు భాషను సంస్కృతిగా బోధించాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
జిల్లా కేంద్రంలో ఘనంగా తెలుగు భాషా శిక్షణ కార్యక్రమం
సృజనాత్మక పద్ధతులతో విద్యార్థుల్లో భాషాభిరుచిని పెంపొందించాలి
మంచిర్యాల, జూలై 16 :తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా మాత్రమే చూడకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించి విద్యార్థులకు బోధించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'తెలుగు భాషా శిక్షణ కార్యక్రమానికి' ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర భాషల ప్రభావం కారణంగా విద్యార్థులకు తెలుగు భాషను సమర్థవంతంగా బోధించడం కొంత సవాలుగా మారిందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు తెలుగు ఉపాధ్యాయులు సృజనాత్మక బోధనా విధానాలను అవలంబించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న వినూత్న బోధనా పద్ధతులను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థులలో తెలుగు భాషపై ఆసక్తి, అభిరుచిని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వంటి సాహిత్య ప్రక్రియలను ఉపయోగించి విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించాలని ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోర్సు కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, శిక్షణ కేంద్ర ఇన్చార్జి బోనగిరి శ్రీనివాస్, జిల్లా స్థాయి డి.ఆర్.పి.లు మరియు తెలుగు భాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు