బీసీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలి
బీసీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలి: జాతీయ బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్
మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని జాతీయ బీసీ హక్కుల సాధన సమితి ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% కి పెంచి A, B, C, D గ్రూపులుగా వర్గీకరించడం, ఐదేళ్లలో బీసీ సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం, చట్టబద్ధతతో కూడిన 'మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్' ఏర్పాటు, ఎంబీసీ (MBC) ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు మరియు అన్ని జిల్లా కేంద్రాలలో రూ. 50 కోట్ల వ్యయంతో బీసీ భవనాల నిర్మాణం వంటి ప్రధాన వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మూడేళ్లు ముగుస్తున్నా కనీస చొరవ చూపకపోవడం అత్యంత ఖేదకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉధృత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపూరి భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు