అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి..
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. సొంత నగదు రూ.20 వేల సాయం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం సోమవారం గ్రామానికి చెందిన చెన్ను నాగభూషణం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించిన మంత్రి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని తన సొంత నగదు నుంచి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
వ్యవసాయ కూలీగా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూనే తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాగభూషణం పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స భారంగా మారిన సమయంలో మంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేయడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా నాగభూషణం కుమారుడి విద్యార్హతల గురించి తెలుసుకున్న మంత్రి, హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన తర్వాత తనను కలవాలని సూచిస్తూ మంచి ఉద్యోగం కల్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో మెరుగైన వైద్యం అవసరమైనా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.
మంత్రి పార్థసారథి చూపిన ఆప్యాయత, ఆర్థిక సాయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆయన అందించిన చేయూత ఆదర్శనీయమని అభినందించారు.