పెనుగొలను, జింకలపాలెం గ్రామాల్లో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావుకు ఘన నివాళి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో రామయ్య, రాంబాయమ్మ దంపతులకు 1916 జూన్ 10న పైడిమర్రి వెంకట సుబ్బారావు జన్మించారని తెలిపారు. 1962లో విశాఖపట్నంలో ఖజానా అధికారిగా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలల్లో చదివే ‘‘భారతదేశం నా మాతృభూమి’’ అనే జాతీయ ప్రతిజ్ఞను రచించారని వివరించారు. ఆయన రచించిన జాతీయ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు.
వెంకట సుబ్బారావు జాతీయ భావాలను పెంపొందించే రచనలతో పాటు నవలలు, పద్యకావ్యాలు, నాటకాలు, కథలు, అనువాద రచనలు చేశారని తెలిపారు. దేశభక్తి, సామాజిక చైతన్యం, విలువలను ప్రతిబింబించే ఆయన సాహిత్య సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
జింకలపాలెంలోనూ నివాళులు
గంపలగూడెం మండలం పెనుగోలు శివారు జింకలపాలెంలోని ఉర్దూ, తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలోనూ గురువారం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ షెహనాజ్ బేగం మాట్లాడుతూ వెంకట సుబ్బారావు గొప్ప దేశభక్తుడని, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించే జాతీయ ప్రతిజ్ఞను రచించారని తెలిపారు.
అనంతరం శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాఠశాలలో నాలుగు, ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ రెండు కార్యక్రమాల్లో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, శిరిడీ సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.