పెనుగొలనులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం
పెనుగొలనులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, కవిగా తనదైన ముద్ర వేశారని తెలిపారు. కాంగ్రెస్ేతర ప్రధానిగా పూర్తిస్థాయి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన తొలి ప్రధానిగా వాజ్పేయి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాజ్పేయి నాలుగు దశాబ్దాల పాటు సీనియర్ పార్లమెంటేరియన్గా సేవలందించారని తెలిపారు. ఆయన లోక్సభకు తొమ్మిదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికై అరుదైన రికార్డు సాధించారని వివరించారు.
సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ వాజ్పేయి జీవితంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర కీలకమైందని తెలిపారు. 12వ ఏటనే ఆర్ఎస్ఎస్లో స్వయంసేవక్గా చేరిన ఆయన, ఆ సంస్థ అందించిన సైద్ధాంతిక శిక్షణతో తన రాజకీయ ప్రయాణాన్ని, వ్యక్తిత్వాన్ని, దేశభక్తిని తీర్చిదిద్దుకున్నారని పేర్కొన్నారు.
1947లో ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి ప్రచారక్గా పనిచేసిన వాజ్పేయి, ఆర్ఎస్ఎస్ పత్రికలు "రాష్ట్ర ధర్మ", "పాంచజన్య"లకు సంపాదకులుగా కూడా పనిచేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచి దాసరి శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.