పోలవరం పూర్వ విద్యార్థుల మానవత్వం.. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక భరోసా
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-03 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు.
అదే బ్యాచ్కు చెందిన కంకోళం చంద్రశేఖర్ రాజు అలియాస్ పెయింట్ చందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు చిన్నపిల్లలు కావడంతో కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సహాయం చేయాలని నిర్ణయించారు.
చందు చిన్న కుమార్తె హోస్మిజ పాప పేరు మీద రూ.1,03,000లతో బ్యాంకులో ఎఫ్డీ ఖాతా ప్రారంభించి డిపాజిట్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఎఫ్డీ డిపాజిట్ బాండును చందు భార్యకు అందజేశారు.
ఆపద సమయంలో తమ స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు. స్నేహబంధానికి, మానవత్వానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.