తెలంగాణ పర్యాటక సంస్కరణలకు నీతి ఆయోగ్ ప్రశంసలు
హైదరాబాద్, జూలై 4: పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన "అన్లాకింగ్ గ్రోత్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్" నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణ పర్యాటక రంగానికి దక్కిన గౌరవమని తెలిపారు. పర్యాటక రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని నీతి ఆయోగ్ సూచించడం రాష్ట్రానికి దక్కిన జాతీయ గుర్తింపని పేర్కొన్నారు.
హోటళ్ల నిర్మాణ నిబంధనల సరళీకరణ, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, భూమి వినియోగంలో వెసులుబాటు, ఫ్లోర్ ఏరియా రేషియో పెంపు, పార్కింగ్ నిబంధనల్లో సడలింపులు, సింగిల్ విండో విధానం బలోపేతం వంటి చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి వివరించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన తెలంగాణ పర్యాటక విధానం-2025-2030 ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇస్తోందని, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ విధానం ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైందని వెల్లడించారు.
గతంలోనూ తెలంగాణ పర్యాటక రంగంలోని పలు ఉత్తమ కార్యక్రమాలు నీతి ఆయోగ్ నివేదికల్లో చోటు దక్కించుకున్నాయని, తాజాగా మరోసారి రాష్ట్రాన్ని ఆదర్శంగా ప్రస్తావించడం తెలంగాణ పర్యాటక రంగం సరైన దిశలో ముందుకు సాగుతున్నదానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేసి, పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.