విజయవాడలో ఉగ్ర అనుమానితుల అరెస్ట్… రాష్ట్రవ్యాప్తంగా కలకలం
విజయవాడలో ఉగ్ర అనుమానితుల అరెస్ట్… రాష్ట్రవ్యాప్తంగా కలకలం
విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతుగా పోస్టులు చేసిన ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
అరెస్ట్ చేసిన వారిలో మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్ ఉన్నారు. ప్రస్తుతం వీరిని గోప్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు, పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
విజయవాడ వన్టౌన్ ప్రాంతంలోని ఒక మసీదులో వీరు పరిచయం ఏర్పరుచుకున్నట్లు విచారణలో బయటపడింది. అనంతరం సోషల్ మీడియా ద్వారా మరికొందరు యువతను ప్రభావితం చేసి ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించే ప్రయత్నాలు చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తున్న దర్యాప్తు సంస్థలు, మరిన్ని వ్యక్తుల ప్రమేయంపై కూడా దృష్టి సారించాయి. ఘటనకు సంబంధించి కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.
రాష్ట్ర భద్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.