వినుకొండలో బంగారు దుకాణం చోరీ కేసు ఛేదనం.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.27 లక్షల ఆస్తి స్వాధీనం
వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షితా జ్యూయలర్స్లో గత నెల 21న జరిగిన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో అంతర్రాష్ట్ర దొంగ రఫీని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.27 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఒక బుల్లెట్ మోటార్సైకిల్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు రఫీపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 చోరీ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా నమోదుకాని కేసులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు.
కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించి చోరీని త్వరగా ఛేదించిన వినుకొండ సీఐ ప్రభాకర్ను డీఎస్పీ అభినందించారు. అలాగే దర్యాప్తులో సహకరించిన పోలీసు సిబ్బంది లక్ష్మణ్, సునీల్, అశోక్, నాయక్, జయరామ్లకు ప్రశంసలతో పాటు రివార్డులు అందజేశారు.
పోలీసుల చాకచక్యంతో భారీ విలువైన ఆస్తి తిరిగి స్వాధీనం కావడంతో బాధితులకు ఊరట లభించింది. ఈ కేసు ఛేదనతో అంతర్రాష్ట్ర చోరీ ముఠాల కదలికలపై పోలీసులు మరింత అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.