ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టుకు కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 1,609.23 ఎకరాలను రక్షణ శాఖ వినియోగానికి, 400 ఎకరాలను పౌర విమానయాన సేవల కోసం కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన టెర్మినల్ సదుపాయాలతో పాటు కార్గో సేవలు, విమానాల మరమ్మతు, నిర్వహణ కేంద్రం (ఎంఆర్వో), ఆధునిక రన్వే వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్టు అమలులో భాగంగా భూసేకరణ, రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు వంటి ప్రాథమిక పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ విమానాశ్రయం అభివృద్ధి పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వైమానిక అనుసంధానం మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.