ఏపీలో అంగన్వాడీ చిన్నారులకు కొత్త ఆహార మెనూ.....
ఏపీలో అంగన్వాడీ చిన్నారులకు కొత్త ఆహార మెనూ.. పోషకాహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ఆహార మెనూలో ప్రభుత్వం మార్పులు చేసింది. పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో వయసుల వారీగా ఆహార పదార్థాల పరిమాణాలు, రకాలలో మార్పులు తీసుకొచ్చింది.
కొత్త మెనూ ప్రకారం 7 నుంచి 12 నెలల వయసున్న చిన్నారులకు నెలకు 1.5 కిలోల జూనియర్ బాలామృతం అందించనున్నారు. అలాగే 13 నుంచి 36 నెలల వయసున్న పిల్లలకు నెలకు 2.5 కిలోల సీనియర్ బాలామృతం పంపిణీ చేయనున్నారు.
3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు వారానికి రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించడంతో పాటు సాయంత్రం వేళల్లో ఉడికించిన శనగలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులకు అందించే అన్ని రకాల వంటకాల్లో మునగాకు వినియోగించాలని అంగన్వాడీ కేంద్రాలకు సూచనలు జారీ చేసింది.
మునగాకులో ఉండే పోషకాలు చిన్నారుల ఎదుగుదలకు, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది. కొత్త మెనూతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సమతుల్యమైన ఆహారం అందుతుందని అధికారులు తెలిపారు.