ఐదుగురితో ద్విచక్ర వాహన ప్రయాణం.. ఎస్సై కౌన్సిలింగ్
ఐదుగురితో ద్విచక్ర వాహన ప్రయాణం.. ఎస్సై కౌన్సిలింగ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: నాయుడుపేట పట్టణ ఎస్సై శివశంకర్ రావు
తిరుపతి జిల్లా, నాయుడుపేట: ద్విచక్ర వాహనదారులతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నాయుడుపేట పట్టణ ఎస్సై ఎం. శివశంకర్ రావు సూచించారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఒకే ద్విచక్ర వాహనంపై ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని గుర్తించి వాహనాన్ని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. పరిమితికి మించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వాహన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
ఇకపై ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించి, మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ అనంతరం వారిని పంపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివశంకర్ రావు తెలిపారు.