అశ్వగంధ సాగుతో ఆరోగ్యానికి భరోసా..
అశ్వగంధ సాగుతో ఆరోగ్యానికి భరోసా.. రైతుకు అదనపు ఆదాయం బహుళ పంటల సాగుతో ఆదాయ భద్రత సాధిస్తున్న సత్తెన్నగూడెం రైతు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామ శివారు సత్తెన్నగూడెం గ్రామానికి చెందిన రైతు అల్లాడ నాగ అమలేష్ కుమార్ ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. తన సొంత భూమిలో పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాన పంటలతో పాటు అంతర పంటల సాగు చేపట్టి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు.
రైతు నాగ అమలేష్ కుమార్ తన నాలుగు ఎకరాల భూమిలో ప్రధాన పంటగా పామాయిల్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఎకరంలో పసుపు పంటను సాగు చేస్తూ, మరో మూడు ఎకరాల్లో అశ్వగంధను అంతర పంటగా సాగు చేస్తున్నారు. అశ్వగంధ సాగులో భాగంగా విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి భూమిలో వెదజల్లడం ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు.
ఔషధ గుణాలు కలిగిన అశ్వగంధ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఒకే పంటపై ఆధారపడకుండా పామాయిల్, పసుపు, అశ్వగంధ వంటి పలురకాల పంటలను సాగు చేయడం వల్ల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏదైనా ఒక పంటకు నష్టం జరిగినా ఇతర పంటల ద్వారా రైతుకు ఆదాయ భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా బీజామృతం వంటి సహజ పద్ధతులను ఉపయోగించడం వల్ల భూమి సారవంతత పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవసాయంలో పంటల వైవిధ్యాన్ని పెంచడం ద్వారా రైతులు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు సమాజానికి ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించవచ్చని సూచించారు.
అశ్వగంధ వంటి ఔషధ పంటల సాగు రైతులకు ఆర్థిక లాభాలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అధికారులు వివరించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను ప్రోత్సహించడం ప్రస్తుతం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ తాతకుంట్ల యూనిట్ ఇన్చార్జి జి. శ్రీనివాసరావు, ఐసీఆర్పీలు వి. విజయలక్ష్మి, పి. అంజిబాబు, బి. శాంతి, లీడ్ ఫార్మర్ టీ. మంగతాయారు పాల్గొన్నారు. రైతు చేపట్టిన బహుళ పంటల సాగును పరిశీలించి అభినందించారు.
విస్సన్నపేట మండలంలో రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఔషధ, అంతర పంటల సాగుపై దృష్టి సారిస్తే తక్కువ వ్యయంతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపారు. రైతు నాగ అమలేష్ కుమార్ చేపట్టిన అశ్వగంధ సాగు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.