చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు
చాట్రయి పోలీసుల పటిష్ట చర్యలు – మహనీయుల విగ్రహాలకు కట్టుదిట్టమైన రక్షణ
చాట్రయి, ఏప్రిల్ 3: చాట్రయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహనీయుల విగ్రహాల రక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో ఈ ప్రత్యేక భద్రతా కార్యక్రమం అమలు చేస్తున్నారు.
నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రయి ఎస్ఐ డి. రామకృష్ణ సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను పరిశీలిస్తూ, ఆయా విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశమై రక్షణ చర్యలపై కీలక సూచనలు చేశారు.
విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, అవి ఎల్లప్పుడూ పని చేసేలా చూసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గౌరవాన్ని కాపాడాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు.
అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై స్థానిక యువత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహనీయుల విగ్రహాలకు హాని కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ డి. రామకృష్ణ హెచ్చరించారు.
గ్రామాల్లో శాంతిభద్రతలు నిలుపుకోవడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు.