ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు
ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు, NTODAY NEWS చిట్యాల
తొమ్మిది మందికి గాయాలు అని ప్రాథమిక సమాచారం
నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలంలో భారీ పేలుడు సంభవించింది. పిట్టపల్లి గ్రామం శివారులో ఉన్న 'న్యూస్ నోచ్ ల్యాబ్' (News Notch Lab) ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. కంపెనీలోని 3వ బ్లాక్లో కార్మికులు విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాల లోపంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.