సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వం త్వరలో సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటు అంతర్జిల్లా బదిలీలు, స్పౌజ్ ట్రాన్స్ఫర్లు అమలుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ అయిన పే స్కేల్ అమలు కోసం కూడా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూ శాఖలకు చెందిన 7,246 మంది సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.
అదేవిధంగా ఉద్యోగుల పనిభారం తగ్గింపు, సెలవుల ఆమోదంలో సౌలభ్యం, గ్రీవెన్స్ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
సచివాలయ ఉద్యోగుల సంక్షేమం, సేవా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.