ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సాక్షిపై కేసు నమోదుకు అనుమతి
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సాక్షిపై కేసు నమోదుకు అనుమతి
అమరావతి: సాక్షి దినపత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబును లక్ష్యంగా చేసుకుని గత జూన్ 30న 'బెజవాడ బాస్ బిగ్ డీల్!' శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఆ కథనంలో అద్విక ట్రేడింగ్ కంపెనీ డిపాజిట్ మోసం కేసు విచారణను కమిషనర్ ప్రభావితం చేశారని, నిందితులతో అక్రమ సెటిల్మెంట్ చేసుకుని లంచం తీసుకున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ప్రచురించారు. అయితే, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వం పేర్కొంది.
ఈ అంశంపై పోలీస్ కమిషనర్ సమర్పించిన ఫిర్యాదు, డీజీపీ నివేదికను పరిశీలించిన అనంతరం, సాక్షి పత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్తో పాటు సంబంధిత బాధ్యులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బీఎన్ఎస్-2023లోని సెక్షన్ 222(2), 222(4)తో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1968లోని రూల్ 17 ప్రకారం ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టాలని ప్రాసిక్యూషన్ డైరెక్టర్తో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ను ఆదేశించింది.
ప్రభుత్వ అనుమతితో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.