మెటా ఇండియా హెడ్ కేసు: సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు
మెటా ఇండియా హెడ్ కేసు: సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృసంస్థ మెటా ఇండియా హెడ్ను కూడా నిందితుడిగా చేర్చడం జాతీయ స్థాయిలో వివాదానికి దారితీసింది.
సోషల్ మీడియాలో వ్యక్తులు చేసిన పోస్టులకు మెటా సంస్థను ఎలా బాధ్యురాలిగా చేస్తారనే అంశంపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేసింది.
ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అరవింద్ బాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.