శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం
ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు
సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆరవ వసంతోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఆశ్రమం ఆరు సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. ఆశ్రమ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న మండల పత్రికేయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ, సమాజంలో నిరాశ్రయులు, వృద్ధులకు అండగా నిలిచి వారికి ఆశ్రయం, ఆహారం, ప్రేమాభిమానాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. దాతల సహకారం, ప్రజల ఆదరణతో వృద్ధాశ్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సామాజిక సేవకులు, దాతలు, గ్రామ ప్రముఖులు, పత్రికేయులు పాల్గొని వృద్ధాశ్రమం అందిస్తున్న సేవలను కొనియాడారు. వృద్ధుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఆశ్రమం మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.